Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-లాక్డౌన్ను కొనసాగించాలి..
-ఇండియాకు ఇదొక్కటే మార్గం : ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
-ఇప్పటి వరకూ రాష్ట్రంలో 364 మందికి కరోనా
-బతికుంటే బలుసాకు తిందాం.. కానీ అమెరికా దుస్థితి మనకొద్దు
-వైద్య సిబ్బందికి మూలవేతనంలో 10 శాతం ప్రోత్సాహకం
-పారిశుధ్య, వాటర్ వర్క్స్ సిబ్బందికీ నగదు బహుమతి
-ఖజానాకు రావాల్సింది రూ.2,400 కోట్లు, వచ్చింది రూ.6 కోట్లే..
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశంలో లాక్డౌన్ కొనసాగించాలని ముఖ్యమంత్రి కెె.చంద్రశేఖరరావు... ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చెందుతున్న ఇండియా లాంటి దేశాన్ని ఈ విపత్తు నుంచి గట్టెక్కించేందుకు ఇదొక్కటే మార్గమని అన్నారు. అమెరికా వంటి అగ్రదేశం నిస్సహాయ స్థితికి చేరిందని గుర్తుచేశారు. ఆ శవాల గుట్టల ఫొటోలను చూస్తుంటే కన్నీళ్లు ఆగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బతికుంటే బలుసాకు తిందాం.. కానీ మనకు ఆ దుస్థితి రాకూడదని అన్నారు. సామూహిక మరణాలను దేశం భరించలేదని తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.
'లాక్డౌన్తో దేశ ఆర్ధిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుంది..మళ్లీ కోలుకుంటుంది...కానీ మనిషి ప్రాణం పోతే తిరిగిరాదు. లాక్ డౌన్ను ఎత్తేస్తే 21 రోజుల కష్టమంతా వృథా అవుతుంది. ఒక్కసారి తాళం తీస్తే ఎవర్నీ ఆపలేం...' అని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఖజానాకు రోజుకు రూ.400 కోట్ల నుంచి రూ.440 కోట్ల వరకూ ఆదాయం వస్తుందని తెలిపారు. ఏప్రిల్లో ప్రస్తుత సమయానికి రూ.2,400 కోట్ల ఆదాయం రావాలనీ, కానీ కేవలం రూ.6 కోట్లే వచ్చాయని చెప్పారు. తెలంగాణ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక యావత్ దేశం పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇప్పటికే 22 దేశాలు వంద శాతం, 90 దేశాలు పాక్షికంగా లాక్డౌన్ను అమ లు చేస్తున్నాయని గుర్తుచేశారు. దీన్నిబట్టి సమస్య తీవ్రతను అర్ధం చేసుకోవాలని అన్నారు. లాక్డౌన్ను శిక్షగా భావించవద్దంటూ ఆయన ప్రజలకు సూచించారు. దాంతోనే దేశాన్ని, తెలంగాణ సమాజాన్ని బతికించుకున్నామని వివరించారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సర్వే ప్రకారం... దేశంలో జూన్ మూడు వరకు లాక్డౌన్ కొనసాగిస్తేనే ఇండియా ప్రమాదం నుంచి బయటపడుతుందని ఆయన వివరించారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సంబంధిత సిబ్బందికి పాదాభి వందానాలు చేస్తున్నట్టు చెప్పారు.
వారి మూల వేతనంలో 10 శాతాన్ని అదనంగా సీఎం గిఫ్ట్ రూపంలో అందజేస్తామన్నారు. పారిశుధ్య కార్మికులు, వాటర్ వర్క్స్ సిబ్బందికి మార్చి వేతనంలో కోత విధించిన మొత్తాన్ని వెంట నే చెల్లిస్తామని తెలిపారు. జీహెచ్ఎమ్సీ, వాటర్ వర్క్స్ సిబ్బందికి అదనంగా రూ.7,500, మున్సిపాల్టీ, పంచాయతీ పారిశుధ్య కార్మికు లకు రూ.5 వేలు సీఎం గిఫ్ట్గా అందజేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంతో 43,661 మంది జీహెచ్ఎమ్సీ, 21,531 మంది మున్సిపాల్టీ, 2,510 మెట్రో వాటర్ వర్క్స్, 27,690 మంది గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులకు లబ్ది చేకూరనుందని కేసీఆర్ తెలిపారు. జిల్లాల్లో రేయింబవళ్లు పనిచేస్తున్న సిబ్బందిని కూడా ప్రోత్సహిస్తామని, రెండ్రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.
రేపటిలోగా ఫేజ్-1 కరోనా బాధితులు డిశ్చార్జి...
విదేశాల నుంచి వచ్చిన 25,937 మందికి క్వారెంటైన్ చేశామనీ, వారిలో కరోనా నిర్దారణ అయిన రోగులు, వారి ద్వారా సంక్రమించిన వారు మొత్తం 50 మందికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని సీఎం వెల్లడించారు. ఆ రోగుల్లో ఇప్పటి వరకూ 35 మంది పూర్తిగా కోలుకుని ఇండ్లకు వెళ్లారని తెలిపారు. మిగిలిన 15 మందిని బుధవారం డిశ్చార్జి చేస్తామని సీఎం చెప్పారు. నిజాముద్దీన్, ఇండోనేషియా ఘటనలతో కలుపుకుని ఇప్పటి వరకూ మొత్తం 364 మందికి కరోనా సోకిందని వివరించారు. మరణించిన 11 మంది నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన వారేనని అన్నారు. గాంధీలో ప్రస్తుతానికి 308 మందికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. నిజాముద్దీన్ వెళ్లివచ్చిన 1,089 మందిని గుర్తించామని.. అందులో 172 మందికి వైరస్ సంక్రమించగా, వారు మరో 90 మందికి అంటించారని తెలిపారు. వీరంతా మరో 3,015 మందిని కలిసినట్టు తేలిందన్నారు. మరో మూడు రోజుల్లో వీరందరికీ పరీక్షలు ముగుస్తాయని వెల్లడించారు. వీరిని గుర్తించటంలో పోలీస్ ఇంటిలిజెన్స్ విభాగం గొప్పగా పని చేసిందని, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.
ప్రధానినే అవహేళన చేస్తారా...?
దేశ ప్రజల ఐక్యతను చాటేలా ప్రధాని మోడీ... దీపం వెలిగించాలంటూ కోరితే, కొందరు దుర్మార్గులు అవహేళన చేస్తున్నారంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మాటలపై జోకులు, సెటైర్లు వేస్తారా..? ఇదేం పద్ధతంటూ అసహనం వ్యక్తం చేశారు. డాక్టర్లకు కిట్లు లేవంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై కేసీఆర్.. విరుచుకుపడ్డారు. ఆ పత్రికనుద్దేశించి దేశ ద్రోహులు, దుర్మార్గులంటూ వ్యాఖ్యానించారు. సరైన సమయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. తాను మీడియాకు వ్యతిరేకం కాదనీ, అయితే అసత్యాలు ప్రచారం చేసే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
రాష్ట్రంలో మందులకు కొరత లేదని సీఎం స్పష్టం చేశారు. వైద్యుల రక్షణ కోసం 40 వేల పీపీఈ కిట్లు సిద్ధంగా ఉన్నాయనీ, మరో 5 లక్షల కిట్లకు ఆర్డర్లిచ్చామని తెలిపారు. పాజిటివ్ కేసులు పెరిగితే యుద్ధ ప్రాతిపదికన చికిత్సనందించేందుకు వీలుగా 8 ఆస్పత్రులను నోటిఫై చేశాం, 25 వేల మంది వైద్య సిబ్బందిని అదనంగా సిద్ధం చేశామని చెప్పారు. నిజాముద్దీన్ వెళ్లొచ్చిన వారు.. ఇంకెవరైనా ఉంటే వెంటనే అధికారులకు రిపోర్టు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఒకే మతానికి చెందిన వారే ఉన్నారన్నది వాస్తవం కాదన్నారు. హిందువులు కూడా వారిలో ఉన్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ప్రోత్సాహకం ప్రకటనపై సంఘాల హర్షం
కరోనా నివారణ చర్యల్లో క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేస్తున్న గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికుల సేవలకు గుర్తింపుగా సీఎం కేసీఆర్ ప్రోత్సాహకాలను ప్రకటించడం పట్ల తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఖమర్అలీ, పాలడుగు భాస్కర్, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.గణపతిరెడ్డి, సీహెచ్ వెంకటయ్య, జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె.వెంకటేశ్, సూర్యప్రకాశ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులు, సిబ్బందికి, రూ.5వేలు, మున్సిపల్ కార్మికులు, సిబ్బంది రూ.7,500 ప్రోత్సాహకాలు ఇవ్వడాన్ని స్వాగతించారు. పారిశుధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, సబ్సులు, యూనిఫాం, గ్లౌజులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు మూల వేతనంలో 10 శాతం ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించడం పట్ల మెడికల్ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు జేఏసీ కన్వీనర్ పుట్ల శ్రీనివాస్, తదితరులు ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్కు ధన్యవాదాలు తెలిపారు.