టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ రకరకాల సేవలు ఫోన్ ద్వారానే అందుబాటులోకి వస్తున్నాయి. ఇదే తరహాలోనే మొబైల్నే బ్యాంకింగ్ సేవలను అందిస్తూ పేటీఎం ముందుకు వచ్చింది. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవస్థ. ఆన్లైన్ చెల్లింపులు చేసే వారికి పేటీిఎం వాలెట్ సుపరిచితమే. సాధారణ బ్యాంకు సేవలకు ఏ రకంగానూ తక్కువ కాకుండా పేటీఎం మొబైల్ బ్యాంకింగ్ సేవలను విస్తరిస్తోంది. డెబిట్ కార్డు, చెక్ బుక్, క్రెడిట్ కార్డు, మ్యూచువల్ ఫండ్స్ ఇలా అనేక రకాల సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
మన దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నొయిడాలో 9 సంవత్సరాల క్రితం.. అంటే 2010 ఆగస్టులో ప్రారంభమైన పేటీఎం వాలెట్ సేవలు.. ప్రస్తుతం బ్యాంకు తరహాలో విస్తరించాయి. దీనిని వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ సారథ్యంలో విజరు శేఖర్ శర్మ ప్రారంభించారు. ఈ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. పేమెంట్ సిస్టమ్స్, డిజిటల్ వాలెట్, మొబైల్ పేమెంట్స్, బ్యాంకింగ్, ఆన్లైన్ షాపింగ్ అంటూ అనేకరకాల సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ పేటిఎంను 350 మిలియన్ల మంది వినియోగిస్తున్నారు. ఇది 11 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది.
సేవలు : మొదట్లో ప్రీపెయిడ్ మొబైల్ డేటా, డీటీహెచ్ రీచార్జ్ల కోసం ప్రారంభమైంది. తర్వాత 2014లో పేటీఎం వాలెట్ను ప్రారంభించింది. ఆ సమయంలో ఇండియన్ రైల్వే, ఉబర్ సంస్థలు ఈ వాలెట్ను యాడ్ చేసుకున్నాయి. 2015లో ఈ-కామర్స్లోకి ప్రవేశించింది. ఆన్లైన్ కొనుగోళ్ళు, బస్టికెటింగ్ వంటి రంగాలలోకి అడుగుపెట్టింది. తర్వాత ఎడ్యుకేషన్ ఫీజులు, మెట్రో చార్జీలు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, గ్యాస్ బిల్లులు, వాటర్ బిల్లుల పేమెంట్ సేవలు అందించడం ప్రారంభించింది. 2016లో మూవీటికెట్లు, ఈవెంట్లు, ఎమ్యూజ్మెంట్ పార్కు టికెట్లు, ఫ్లైట్ టికెట్లు వంటివి క్యూఆర్ కోడ్ ఉపయోగించి బుక్ చేసుకునే వెసులుబాటును తీసుకువచ్చింది. 2014 ఆగస్టులో 11.8 మిలియన్లుగా ఉన్న వినియోగ దారులు 2015 ఆగస్టు నాటికి 104 మిలియన్లకు చేరుకున్నాయంటేనే ఈ సేవలు ఏ మేర విస్తరించాయోచెప్పవచ్చు. 2017 నాటికి మన దేశంలో 100 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్న పేమెంట్ యాప్గా నిలచింది. అదే సంవత్సరంలో రూ.1 నుంచి ప్యూర్ గోల్డ్ను కొనుగోలు చేసేలా పేటీఎం గోల్డ్ సేవలను ప్రారంభించింది. మొబైల్ రీచార్జ్, బిల్ పేమెంట్స్, ప్రయాణాలు, సినిమాలు, ఈవెంట్ బుకింగ్స్, గ్రాసరీ స్టోర్లు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ షాప్స్, రెస్టారెంట్లు, పార్కింగ్, టోల్స్, ఫార్మసీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఫీజులు తదితరాలకు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేసే వీలు కల్పిస్తోంది. ఆయా ప్రదేశాలలో ఈ కోడ్ అందుబాటులో ఉండడం వల్ల డబ్బులు చెల్లింపులు సులభమవుతున్నాయి. మన దేశవ్యాప్తంగా 7 మిలియన్ల మంది వ్యాపారస్తులు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్స్ను అనుమతిస్తున్నారు. ఎల్ఐసీ చెల్లింపులు కూడా సులభతరమయ్యాయి.
మొబైల్ బ్యాంకింగ్ యాప్! : పేటీఎంలో ప్రస్తుతం చెప్పుకోవాల్సింది బ్యాంకింగ్ గురించి.. 2017లో ప్రారంభమైన ఈ సేవలు రోజురోజుకు బాగా విస్తరిస్తున్నాయి. దీని ద్వారా బ్యాంక్ అకౌంట్ను వేగంగా, సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అకౌంట్ బ్యాలెన్స్ వివరాలు, డెబిట్ కార్డు సేవలు, డిజిటల్ డెబిట్ కార్డు యాక్సెస్ వంటి తదితర సేవలు పొందొచ్చు. ఈ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా ఎప్పుడైనా బ్యాంక్ సహాయాన్ని కోరవచ్చు. బ్యాంక్కు ప్రస్తుతం 4.3 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. వారంలో ఏడు రోజులూ బ్యాంక్ సేవలు పొందొచ్చు. బ్యాంకు ఖాతా కావాలనుకుంటే..
యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాలేషన్ పూర్తి చేయాలి. మొబైల్ నెంబర్తో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి, బ్యాంక్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. టెర్మ్స్ అండ్ కండిషన్స్ కింద ప్రొసీడ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. పాస్కోడ్ పెట్టుకోవాలి. తర్వాత నామినీ వివరాలతో పాటు అవసరమైన వివరాలు అన్నింటినీ ఎంటర్ చేయాలి. అకౌంట్ క్రియేట్ చేసుకునేపుడే కేవైసీ పూర్తి చేసి ఉంటే బ్యాంక్ సర్వీస్ రెడీ అని వస్తుంది. ఒకవేళ కేవైసీ పూర్తి చేయకుంటే, పాన్కార్డు లేదా ఫామ్ 60 తప్పనిసరి అవసరం ఉంటుంది. ఇందులో రాష్ట్రం, జిల్లా తదితర వివరాలతో పాటు అడిగిన సమాచారాన్ని ఎంటర్ చేసిన తర్వాత అకౌంట్ ఓపెనింగ్ స్టేటస్ చెక్ చేసుకోమని చెప్తుంది. అందులో కేవైసీ పెండింగ్ ఆప్షన్ చూపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే, అన్లాక్ ఆల్ డిటైల్స్ టు కంప్లీట్ ఫుల్ కేవైసీ ఆప్షన్ చూపిస్తుంది. అందులో 'ఆధార్ వెరిఫికేషన్ ఎట్ ఏ నియర్ బై కేవైసీ పాయింట్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దగ్గర్లలోని ఏదైనా కేవైసీ పాయింట్కు వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, బయోమెట్రిక్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ముందుగానే ఆధార్ వివరాలు నమోదు చేసుకుని తర్వాత బయోమెట్రిక్ పూర్తి చేసుకోవచ్చు. అయితే బయోమెట్రిక్ పూర్తి అయితేనే అకౌంట్ ఓపెన్ అయినట్టు. దుకాణదారుడికి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన పని లేదు. అకౌంట్ ఓపెన్ అవ్వగానే ఫోన్లోనే డెబిట్ కార్డు కనిసిస్తుంది. కార్డు కోసం అప్లై చేసుకోవడానికి వాలెట్లో రూ.250 ఉండాలి. అప్లై చేసుకున్న దగ్గర నుంచి 15 రోజులలోపు కార్డు కొరియర్లో వస్తుంది. కార్డు వచ్చాక క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకుంటే, కార్డు పిన్ నెంబర్ సెట్ చేసుకునేందుకు ఆప్షన్ చూపిస్తుంది. చెక్బుక్ కావాలనుకుంటే చెక్ బుక్ రిక్వెస్ట్ కూడా పెట్టుకోవచ్చు. అందులో 'వ్యూ ఆఫర్స్్' అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే కార్డు మీద ఏ ఏ రకాల సేవలు పొందవచ్చొ ఉంటుంది. బ్యాంకింగ్ సేవలతో పాటు అనేక రకాలుగా పేటీఎం అందుబాటులో ఉంటోంది.
మ్యూచ్వల్ ఫండ్ ఇన్వెస్టర్లకు : దేశీ అతిపెద్ద ఆన్లైన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాట్ఫామ్ పేటీఎం మనీ 'రిజిస్టర్ సిప్ నౌ.. పే లేటర్' ఫీచర్ ద్వారా ఇన్వెస్టర్లు సిప్ ఖాతా ప్రారంభానికి సంబంధించి వెంటనే చెల్లింపులు జరపాల్సిన అవసరం ఉండదు. తర్వాత చెల్లింపులు (పే లేటర్) ఆప్షన్ ఎంచుకోవచ్చు. దాదాపుగా అన్ని ఏఎంసీలు అందించే వివిధ రకాల స్కీమ్స్కు పే లేటర్ సౌలభ్యం వర్తిస్తుంది. స్కీమ్ను, ఇన్వెస్ట్మెంట్ తేదీని, ఎప్పుడు చెల్లింపులు జరిపేది ఎంపిక చేసుకుంటే సరి. దీనితో పాటు మనీ యూజర్లకు ఆటోపే సౌలభ్యాన్నీ అందిస్తోంది. యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ విధానాన్ని ఎంచుకుంటే రిమైండర్లు వస్తాయి. ఇన్వెస్ట్ చేసే ఫండ్ ఎలాంటి పనితీరు కనబరుస్తుందో కూడా పేటీఎం మనీ ప్లాట్ఫామ్ ద్వారా చూడొచ్చు. 34 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలతో పేటీఎం మనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఫ్రీగా క్రెడిట్ స్కోరు : పేటిఎం మొబైల్ యాప్ ద్వారా క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో చూడటం మాత్రమే కాదు.. క్రెడిట్ రిపోర్ట్ వివరాలను కూడా ఈ-మెయిల్లో పొందొచ్చు. ఇందులో క్రెడిట్ యుటిలైజేషన్స్, రీపేమెంట్ చెల్లింపుల హిస్టరీ వంటి వివరాలు ఉంటాయి. క్రెడిట్ రిపోర్ట్లో సబ్స్క్రైబర్ పేరుపై ఉన్న క్రిడెట్ కార్డులు, తీసుకున్న రుణాలకు సంబంధించిన వివరాలు చూడొచ్చు.
క్రెడిట్ కార్డులు : ఫస్ట్ కార్డు పేరుతో క్రెడిట్ కార్డులను అందిస్తోంది. ఇందుకోసం సిటి బ్యాంక్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు. ప్రతి లావాదేవీపై ఒక శాతం క్యాష్బ్యాక్ ఉంది. వార్షిక ఫీజు రూ.500 ఉంటుంది. కార్డు ద్వారా ఏడాదికి రూ.50,000కు పైగా ఖర్చు చేస్తే ఈ రూ.500 వార్షిక ఫీజును కూడా చెల్లించాల్సినా అవసరం లేదు. విదేశాల్లోనూ ఉపయోగించొచ్చు. యాప్ నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో సమాచారం ఆన్లైన్లో చూడొచ్చు.
విదేశీ మారకపు సేవలు : విదేశీ మారక సేవలు, అంతర్జాతీయ చెల్లింపుల వ్యాపారం లోనూ రాణిస్తోంది. అధీకృత డీలర్షిప్కు సంబంధించిన కేటగిరీ-2 లైసెన్సును ఆర్బీఐ కంపెనీకి అందించింది. దీని వల్ల దేశంలో పర్యటిస్తున్న విదేశీయులకు కరెన్సీ మారక సేవలతో పాటు స్వదేశీయులకు కూడా విదేశీ కరెన్సీ అందించేందుకు అనుమతులు లభించినట్టయింది. త్వరలో క్రాస్ బోర్డర్ చెల్లింపులను కూడా కంపెనీ ప్రారంభించే అవకాశాలున్నాయి. వీటితో పాటు పలు రకాల సేవలు పేటీఎం అందిస్తోంది.
Authorization