Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నాకు ఇద్దరు శత్రువులున్నారు. ఒకటి బ్రాహ్మణిజం, రెండు క్యాపిటలిజం. వీటిని అంతం చేయటమే భారతీయుల కర్తవ్యం'' అని బాబా సాహెబ్ అంబేద్కర్ పేర్కొన్నారు. సరిగ్గా అంబేద్కర్ శత్రువు నేడు కేంద్రంలో అధికారంలో ఉన్నది. రెండు తలల ''శిఖండి'' మాదిరిగా ఓవైపు బ్రాహ్మణిజం, మరోవైపు పెట్టుబడిదారీ విధానం అభివృద్దే లక్ష్యంగా కృషి చేస్తున్నది. దాని దుష్పలితాలే దేశంలోని మెజారిటీ ప్రజల అన్ని రకాల అసమానతలకు మూల కారణం.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు అమలు చేస్తున్నామనుకునే వాళ్ళలో మెజారిటీ వ్యక్తులు, సంస్థలు ఆయనను కేవలం రాజ్యాంగ నిర్మాతగా, రిజర్వేషన్ల ప్రదాతగా కొనియాడుతూ ఆయన జయంతులు, వర్థంతుల సందర్భంగా దండలు వేసి, దండాలు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. మరికొంత మంది తమ గ్రామాల్లో, గల్లీల్లో అంబేద్కర్ విగ్రహాలు నెలకొల్పి ఇదే అంబేద్కర్ ఆశయమని సంబరపడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు అంబేద్కర్ ఆశయసాధన కోసం కృషి చేయాలని పిలుపునిస్తుంటాయి. చివరికి అంబేద్కర్ ఏ మనువాదం అంతం కావాలని కోరుకున్నాడో, ఎందుకు ''పుట్టటం నాచేతుల్లో లేక హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మాత్రం చావను'' అని శపథం బూనాడో ఆ హిందుత్వ మనువాద శక్తులు కూడా అంబేద్కర్ను హైజాక్ చేస్తూ, సామాజిక సమరసత వేదిక పేరిట జయంతులు, వర్థంతులు నిర్వహిస్తున్నాయి. పైకి అంబేద్కర్ను మొక్కడం, లోపల అంబేద్కర్ ఆశయాలను త్రొక్కడం వీరి అసలు ఉద్దేశ్యం. అంబేద్కర్ ఆలోచనలు, ఆయన ఆశయాలు, ఆయన కలలుగన్న కులరహిత భారతదేశం సాకారం కావాలంటే ఏంచేయాలి? ప్రస్తుతం ఏం చేస్తున్నాం? అనే చర్చను ఆహ్వానించాలి. అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం ఎదుట 300అండుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. రష్యా దేశ అధ్యక్షులు పుతిన్ ప్రధాన చాంబర్లో తనసీటు వెనుక అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టుకున్నాడు. ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ 125వ జయంతి నుంచి ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించ డమేగాక ఏప్రిల్ 14ను ''ప్రపంచ విజ్ఞాన దినం''గా పేర్కొన్నది. ప్రపంచం గర్వించే మహౌన్న తుడు ఈదేశంలో అంటరానివాడుగా చూడబడుతున్నాడు. ప్రపంచ నాగరిక సమాజాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన భారతీయ మడిగట్టిన దుష్ట సమాజంలోని లోపాలను, అసమానతలను అవపోసన పట్టాడు. దేశంలోని దళితులు రెండు రకాల బాధలు అనుభవిస్తున్నారని ప్రకటించాడు. ఒకటి ఆకలి. ఇది అందరికీ ఉంటుంది. మరొకటి అవమానం. ఆకలి బాధతోపాటు తక్కువ కులం అనే అవమానాన్ని వేల సంవత్సరాలుగా దళితులు భరిస్తున్నారని పేర్కొన్నాడు. దేశంలో ఆకలి, అవమానం ఒకదానికొకటి పెనవేసుకొని ఉన్నాయని, రెండింటినీ ఏకకాలంలో ఈదేశం నుంచి తరిమేయాలని పిలుపునిచ్చాడు. అందుకే ఆయన ''స్టేట్ అండ్ మైనారిటీస్'' అనే బుక్లో ఈ విధంగా పేర్కొన్నాడు. ''భారతదేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే సోషలిస్టు విధానం తప్ప మరో దారి లేదన్నారు. నాకు సోవియట్ విధానమే మంచిదనిపిస్తోంది. సమిష్టి వ్యవసాయ పథకమే ఈ సమస్యలన్నింటికీ నివారణోపాయం అనుకుంటున్నాను. రష్యాలో ఉండే వ్యవసాయ పద్ధతే నా దృష్టిలో చాలా మంచిది'' అని ఆయన పేర్కొన్నాడు. అందుకే ఆయన సామ్యవాద స్వాప్నికుడు అనడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఉత్పత్తి సాధనాలలోని అంత్యంత కీలకమైన భూమి ప్రభుత్వ యాజమాన్యంలో ఉండాలన్నాడు. వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించాలన్నాడు. అందుకే భూమి జాతీయీకరణ జరగాలనే అత్యున్నత డిమాండ్ను ముందుకు తెచ్చాడు. గ్రామాల్లో భూస్వామి, కౌలు, కూలీ ఉండకుండా ప్రభుత్వమే సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు ఏర్పర్చలన్నాడు. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలో రైతులపై విధించే ''ఖోటీ'' అనే పన్ను విధింపునకు వ్యతిరేకంగా ఆయన రైతాంగ పోరాటాల్లో ప్రత్యక్షంగా భాగస్వామి అయ్యాడు. పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటాహక్కు ఉండాలన్నాడు. ఇందుకుగాను కార్మిక చట్టాలను ఆయనే కేంద్ర మంత్రిగా ఉన్నకాలంలో రూపొందించాడు. నేటి కార్మికుల కనీసవేతన చట్టం, స్త్రీలకు ప్రసూతి సెలవులు వంటి మరెన్నో ఆయన చలవే. మనుస్మృతి ఈదేశంలోని మెజారిటీ ప్రజలకు చదువు, భూమి, ఆభరాణాలు, ఆయుధం, అధికారాలను వేలఏండ్లు దూరం చేసింది. అంబేద్కర్ తన జీవితం ఆదినుంచి అంతం వరకు పైఐదు వజ్రాయుధాలను బహుజన, శ్రామికజనం వశం చేయడంపైనే దృష్టి సారించాడు. దేశంలోని మనుస్మృతి, చాతుర్వర్ణ వ్యవస్థ మనుషులందరినీ ముక్కలు ముక్కలుగా చేసి ఎక్కువ తక్కువలు సృష్టిస్తే, అంబేద్కర్ చట్టం ముందు మాత్రం అందరూ సమానులే. కులవివక్ష అంటరానితనం చట్టరిత్యా నేరమని రాజ్యాంగ బద్దంగానే చెప్పాడు. బాల్యం నుంచి అంబేద్కర్ అనేక అవమానాలు దిగమింగాడు. బల్లో చదవనివ్వలేదు. గుడిలోకి రానివ్వలేదు. చెరువు, ఊరుమ్మడి బావిలో నీళ్ళు ముట్టనివ్వలేదు. వీటన్నింటిపై ఆయన ప్రత్యక్ష తిరుగుబాటు చేశాడు. మహద్ పట్టణంలోని చౌదార్ చెరువు మంచినీళ్ళ పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమైంది. నాసిక్లోని కాలారాం దేవాలయ పోరాటం నాడు అనేకమందిని కదిలించింది. అంబేద్కర్ అంటే ఓటు, కనీసవేతనం, స్త్రీ సమానత్వం, రాజ్యాధికారం, భూమి, పరిశ్రమలు మెజారిటీ ప్రజలకు దక్కడం. పైవన్నీ అడుక్కుంటే బిచ్చగాళ్ళం అవుతాం. పోరాడితే విజయం సాధించి వీరులమవుతాం అంటాడాయన. అందుకే లొంగుబాటు, రాజీపడడం అనేది బానిస బతుకుకంటే హీనమవుతుందన్నాడు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేడు అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నది. రాజ్యాంగంపై ప్రమాణం చేస్తున్న పాలకులు ఆ రాజ్యాంగాన్నే సమాధి చేయటానికి కుట్రలు చేస్తున్నారు. దేశ ప్రధాని మోడీ అంబేద్కర్ పుట్టిన గడ్డ ''మౌ'' పట్టణంకు వెళ్ళి ఆయన సమాధిపై మోకరిల్లి ''అంబేద్కర్ దేవుడా నువ్ లేకుంటే నేను ప్రధానిని అయ్యేవాడినే కాదు'' అని సెలవిచ్చాడు. కానీ ఈ దేశానికి పవిత్ర గ్రంథం ''భగవద్గీత'' అని ఆ తరువాత చెప్పాడు. మాట్లాడితే స్వదేశీ, దేశభక్తి వంటి నినాదాలతో మేకతోలు కప్పుకున్న తోడేలు వలే మందలో పడి ఒక్కొక్క మేకను తింటున్నట్లుగా ఉంది మోడీ పరిపాలన. నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ రిమోట్ ఆన్చేస్తే నరేంద్రమోడీ అనే బొమ్మ ఎగురుతుంటుంది. గోరక్షక దళాల పేరిట బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై విపరీతమైన హింస జరిగితే ఆయన పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఆయన స్వంత రాష్ట్రం గుజరాత్లో దళితులపై 360శాతం దాడులు పెరిగాయి. దళితులపై దాడులు, దౌర్జన్యాలు అరికట్టడానికి ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేసింది ఆయన ప్రభుత్వం అయితే దళితులు ఐక్యంగా ప్రతిఘటించి తిరిగి కాపాడుకున్నారు. సామాజిక న్యాయం అనేపదాన్ని పాలకులు పదేపదే వల్లిస్తున్నారు. దేశంలోని దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీల జీవితాల్లో సమూల మార్పులు రాకుండా సామాజిక న్యాయం అనే పదానికి అర్థం లేదు. 70 ఏండ్లుగా మన పాలకులకు ఈ దృష్టికోణం ఇసుమంతకూడా లేదు. రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ పాలనలో ఓవైపు రాజ్యాంగ దినోత్సవాలు జరుపుతూనే మరోవైపు రాజ్యాంగ పునాదులను ధ్వంసం చేస్తున్నారు. లౌకికతత్వం, భావప్రకటనా స్వేచ్ఛ, పౌరస్వేచ్ఛ లను కాలరాస్తున్నారు. తాము మూఢత్వంతో ఏది మాట్లాడినా దేశభక్తి, ఇతరులు రాజ్యాంగబద్దంగా మాట్లాడినా అది దేశద్రోహంగా పేర్కొంటున్నారు. అధికార అండదండలతో ఉన్నత విద్యాలయాల్లో భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. ఢిల్లీ జేఎన్యూ అధ్యక్షురాలిపై మాస్కులు ధరించి చేసిన మూకదాడి ఇందుకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ. కులవిద్వేషాలు,మతవైషమ్యాలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. దాడులు, దౌర్జన్యాలు మరింతగా పెచ్చరిల్లుతున్నాయి. 1994 నుంచి 2018 వరకు 24 ఏండ్లలోపు వయస్సు కలిగినవారు 16,700 మంది హత్యకు గురయ్యారు. 37596 మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దాడులు తారాస్థాయికి చేరాయి. 2015లో 2326, 2016లో 2541, 2017లో 2714, 2018లో 2936 మంది దళిత మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. గడిచిన 24 ఏండ్లలో 8,24,652 కేసులు నమోదయ్యాయి. అంబేద్కర్ ఆశయసాధన కోసం కృషి చేయాలనుకునే ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాల్సిన ఆవశ్యకత నేడు ఏర్పడింది. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, రిజర్వేషన్లు రక్షించుకోవడం, మనువాదంపై పోరాటం చేయడం మన తక్షన కర్తవ్యం కావాలి.
టి. స్కైలాబ్ బాబు
సెల్: 9177549646