Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యాపిిటల్ హిల్ పై ట్రంప్ మద్దతుదారుల దాడి
- అగ్రరాజ్యంలో అలజడి.. నలుగురు మృతి
- కాంగ్రెస్ సమావేశాన్ని అడ్డుకునే యత్నం
- ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు
- సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలు, వ్యాఖ్యలు
వాషింగ్టన్ : ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ అని చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికాలో యావత్ ప్రపంచం ఉలిక్కిపడేలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడుగా ఎన్నికైన బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం కేపిటల్ భవనంలో ఉభయ సభల సమావేశం జరుగుతోంది. ఈలోగా వేలాదిమంది ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్ని చుట్టుముట్టారు. లోపలకు చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పులు, ఘర్షణల్లో నలుగురు మరణించారు. 14మంది పోలీసు అధికారులు గాయపడ్డారు. 52 మందిని అదుపులోకి తీసుకున్నారు.
బారికేడ్లు దాటి, గోడలు ఎక్కి....
ఎన్నికల ప్రచార ర్యాలీ తరహాలో వచ్చిన ట్రంప్ అనుచర సాయుధ మూకలు ఒక్కసారిగా పోలీసు బారికేడ్లను దాటి, గోడలు ఎక్కుతూ క్యాపిటల్ హిల్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు లోపలకు చొచ్చుకు వస్తున్నారంటూ భద్రతా సిబ్బంది ప్రతినిధుల సభ, సెనెట్లను అప్రమత్తం చేశారు. దాంతో ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సమావేశం నుంచి తన చాంబర్కు వెళ్ళిపోయారు. దాదాపు 90నిముషాలు దాటిన తర్వాత ఆందోళనకారులు లోపలకు చొచ్చుకు రావడంతో పోలీసులు సెనెట్, ప్రతినిధుల సభలకు తాళాలు వేశారు. లోపల వున్న సభ్యులు బిక్కుబిక్కుమంటూ భయంతో గడిపారు. సభ్యులు లోపలే వుండాలని అవసరమైతే సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధంగా వుండాలని భద్రతా సిబ్బంది కోరారు. పరిస్థితి చేజారే ప్రమాదం ఉండడంతో పోలీసులు తుపాకులు, బాష్పవాయు గోళాలను ప్రయోగించక తప్పలేదు. అయినా వెనక్కి తగ్గని మూకలు చాంబర్ల తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు అక్కడ నుండి వెళ్ళిపోయి ఆత్మరక్షణ నిమిత్తం భూగర్భ సొరంగంలో దాక్కోవాల్సి వచ్చింది. ఇలా దాదాపు నాలుగు గంటలకు పైగా ఘర్షణలు, గందరగోళ వాతావరణం కొనసాగింది. ఘర్షణల్లో ఒక మహిళతో సహా నలుగురు మరణించారు. సాయంత్రం సమయానికి మొత్తంగా క్యాపిటల్ హిల్ని బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. దాంతో పరిస్థితి కుదుటపడడంతో రాత్రి సమయంలో కాంగ్రెస్ ఉభయ సభలు మళ్ళీ సమావేశమయ్యాయి. బైడెన్ ఎన్నికను ధ్రువీకరించే క్రమాన్ని చేపట్టాయి.
బైడెన్ విజయాన్ని ధ్రువీకరించిన కాంగ్రెస్
ఎట్టకేలకు డెమోక్రాట్ నేతలు జో బైడెన్, కమలా హారిస్ల విజయాన్ని అమెరికన్ కాంగ్రెస్ ధ్రువీకరించింది. నవంబరు 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వీరు గెలిచినట్టు ప్రకటించింది. దీంతో ఈ నెల 20వ తేదీన అధ్యక్షుడుగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్లు బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. అమెరికా ఎలక్టోరల్ కాలేజీలో మొత్తంగా 538 ఓట్లుండగా, అధ్యక్షుడిగా ఎన్నికవాలంటే 270ఓట్లు రావాల్సి వుంటుంది. గత నవంబరు 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్కు 306 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. 51.3శాతం అంటే 8కోట్ల 12లక్షల ఓట్లు ఆయనకు వచ్చాయి. మరోవైపు రిపబ్లికన్ నేత, అధ్యక్షుడు ట్రంప్కు 232 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయనకు 7కోట్ల 42లక్షలు అంటే 46.8శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పటికే ఎలక్టోరల్ కాలేజీ ఈ ఓట్లను ధ్రువీకరించింది. అయినా తాజాగా అమెరికన్ కాంగ్రెస్ కూడా ధ్రువీకరించడంతో బైడెన్ ఎన్నిక అధికారికంగా ప్రకటించినట్లైంది.
పరువు పోగొట్టుకున్న అగ్రరాజ్యం
అగ్రరాజ్యమైన అమెరికా చరిత్రలోనే కనివినీ ఎరుగని విధంగా జరిగిన ఈ సంఘటనతో అంతర్జాతీయ సమాజంలో అమెరికా పరువు పోగొట్టుకుంది. ఇక 'ప్రజాస్వామ్య దిక్సూచి' అన్న పేరు మాసిపోతుందని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానించారు. క్యాపిటల్ హిల్ వద్ద జరుగుతున్న ఘటనలను ప్రపంచ దేశాలన్నీ తిలకించాయి. తామెంతగానో అభిమానించే దేశం ఇలా గందరగోళంలో చిక్కుకోవడంతో అమెరికా మిత్రపక్షాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. ''అమెరికా అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీసిన వాటర్లూ యుద్ధం'' వంటిదని చైనా పరిశీలకులు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం సాకుతో భవిష్యత్లో ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే చట్టబద్ధత, అర్హతను అమెరికా పూర్తిగా పోగొట్టుకుందని పేర్కొన్నారు. గురువారం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునియాంగ్ మాట్లాడుతూ, అమెరికన్లు తిరిగి శాంతి, సుస్థిరతలను, భద్రతను త్వరలోనే పునరుద్దరించుకోగలరని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 2019లో హాంకాంగ్లో చోటు చేసుకున్న సామాజిక సంక్షోభంపై అమెరికాలోని కొంతమంది వ్యక్తులు, మీడియా పూర్తి భిన్నమైన కథనాన్ని ఎందుకు ఇచ్చారో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. ''ఆనాడు హాంకాంగ్ గురించి వారేమి పదాలు ఉపయోగించారు? ఇప్పుడేమీ పదాలు ఉపయోగిస్తున్నారు?'' అని ఆమె ప్రశ్నించారు. అమెరికాలోని ప్రధాన స్రవంతిలో వున్న మీడియా దాన్ని ''హింసాత్మకం, తీవ్రవాదులు, దుండగులు అని అభివర్ణించింది. ఇప్పుడు ప్రజాస్వామ్య యోధులని పేర్కొంటోంది. అమెరికాలో జరిగిన తాజా అధ్యాయంపై చైనా నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ''కర్మ, ప్రతీకారం, అందుకు అర్హులే' వంటి పదాలను ఎక్కువగా తమ వ్యాఖ్యల్లో ఉపయోగిస్తున్నారు. కేపిటల్ భవనంలో జరిగిన ఘర్షణలు, కాల్పులకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అల్లర్లు ప్రారంభమైనప్పటి నుండి అమెరికా, చైనా సహా అంతర్జాతీయ వార్తా సంస్థల్లో ప్రసారమవుతునే వున్నాయి. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్లు తాత్కాలికంగా ట్రంప్ ఖాతాలను మూసివేశాయి.
మన దేశానికి సిగ్గుచేటు! : ఒబామా
ఈ క్షణం మనదేశానికి, మనందరికీ సిగ్గు చేటని మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సమాజంలో మనల్ని అగౌరవపాల్జేసిన క్షణమిదని ఆయన పేర్కొన్నారు. కనీవినీ ఎరుగని దాడి ఇదని అధ్యక్షుడుగా ఎన్నికైన బైడెన్ వ్యాఖ్యానించారు. ఇకనైనా ఈ ఘర్షణలకు అంతం పలకండి అని ఆయన ట్రంప్ను కోరారు.
నిబంధనల ప్రకారం.. వైట్హౌస్ అప్పగిస్తా : ట్రంప్
వాషింగ్టన్ : ట్రంప్ ఎగదోసిన సాయుధ మూకల ముట్టడి మధ్య అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ గెలుపును అమెరికన్ కాంగ్రెస్లోని ఉభయ సభల సభ్యులు గురువారం ధ్రువీకరించారు.
ఆ వార్తలు ఆవేదనకు గురిచేశాయి : మోడీ
భారత్ : వాషింగ్టన్లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన వార్తలు చూసి తానెంతో ఆవేదన చెందానని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. క్రమబద్ధంగా, శాంతియుతంగా అధికార బదిలీ జరగాలని, చట్ట విరుద్ధమైన నిరసనల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను అణచివేయడం సమర్థనీయం కాదని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్నకు సూచించారు.