హైదరాబాద్: కల్లోలభరిత ఆఫ్ఘనిస్థాన్ లో భారీ హిమపాతం విషాదాన్ని మిగిల్చింది. గత కొన్నిరోజులుగా విపరీతంగా మంచు కురుస్తుండడంతో ఇప్పటివరకు 42 మంది మృత్యువాతపడ్డారు. 76 మంది అస్వస్థతకు గురయ్యారు. గత మూడు వారాలుగా ఆఫ్ఘనిస్థాన్ లో 15 ప్రావిన్స్ లలో మంచు బీభత్సం నెలకొంది. కొన్ని అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో రహదారులు మూసుకుపోయాయి. ప్రజలు ఇళ్లలోంచి బయటికి వచ్చే మార్గం లేకుండా పోయింది. సహాయక చర్యలకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇటీవలే భూకంపాల ధాటికి ఆఫ్ఘనిస్థాన్ లో పలు ప్రాంతాల్లో ప్రాణనష్టం జరిగింది. ఇప్పుడు మంచు కూడా ఆఫ్ఘన్ల పాలిట మృత్యువుగా మారింది. ఈ మంచు వర్షం ధాటికి 2 వేలకు పైగా ఇళ్లు ధ్వంసం అయ్యాయని అధికారులు చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm