హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ప్రైవేట్ మందుల దుకాణాలను ఎత్తివేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రభుత్వమే ఉచితంగా మందులు ఇస్తున్నప్పుడు వీటిని ఎందుకు కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బోధనాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోని ప్రైవేట్ ఔషధ దుకాణాలను ఎత్తివేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో వాటిని ఏర్పాటు చేసిన యాజమాన్యాల నుంచి రాజకీయ ఒత్తిడి పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఖాళీ చేయబోమని చెబుతున్నట్లు తెలిసింది. అవసరమైతే కోర్టులకు వెళ్లి ఖాళీ చేయించకుండా స్టే తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తామన్నట్లు సమాచారం. అయితే చట్టపరమైన చిక్కులు తలెత్తకుండా వీటిని ఎలా ఖాళీ చేయించాలన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు ప్రారంభించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ మందుల దుకాణాలను ఎత్తి వేయాల్సిందేనని మంత్రి హరీశ్రావు.. అధికారులకు హుకుం జారీచేశారు. దీంతో తొలగింపునకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రైవేట్ దుకాణాలను ఎత్తివేయడమే కాకుండా.. తక్షణమే అన్ని ఆసుపత్రుల్లో ఉచితంగా అన్ని రకాల మందులు, అవసరమైనన్ని సరఫరా చేయాలని కూడా వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. రోగులు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది.
Mon Jan 19, 2015 06:51 pm