హైదరాబాద్ : ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ కోల్కతా నైట్ రైడర్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య గత రాత్రి జరిగిన చివరి లీగ్ మ్యాచ్ అసలైన మజా పంచింది. చివరి బంతి వరకు ఉత్కంఠకు గురిచేసిన ఈ మ్యాచ్లో చివరికి లక్నో రెండు పరుగుల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లగా ఓడిన కోల్కతా ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో వికెట్ కోల్పోకుండా డీకాక్ (140), రాహుల్ (68) పరగులతో 210 పరుగులు చేయగా, కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్కతా కూడా ధీటుగానే బదులిచ్చింది. ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (0), అభిజీత్ తోమర్ (4) ఇద్దరూ 9 పరుగులకే నిష్క్రమించినప్పటికీ నితీష్ రాణా, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సమయోచితంగా ఆడుతూ జట్టును గాడిలో పెట్టారు. బౌలర్లపై విరుచుకుపడుతూ విజయం దిశగా నడిపించారు. 22 బంతుల్లో 9 ఫోర్లతో 42 పరుగులు చేసిన రాణా అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన శామ్ బిల్లింగ్స్ కూడా అదే ఊపు కొనసాగించాడు. 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ (50) చేసిన శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాత కాసేపటికే శామ్ బిల్లింగ్స్ (24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు) అవుట్ కావడంతో కోల్కతా తడబడింది. ఆదుకుంటాడనుకున్న ఆండ్రూ రసెల్ (5) కూడా వచ్చిన వెంటనే పెవిలియన్ చేరడంతో కేకేఆర్ ఆశలు అడుగంటాయి. అయితే, రింకూ సింగ్, సునీల్ నరైన్ జట్టును పట్టాలెక్కించి విజయం దిశగా నడిపించి లక్నోకు చెమటలు పట్టించారు. చివరి ఓవర్లో కోల్కతా విజయానికి 21 పరుగులు అవసరం కాగా, స్టోయినిస్ వేసిన ఆ ఓవర్లో రింకూ సింగ్ చెలరేగిపోయాడు. వరుసగా ఫోర్, రెండు సిక్సర్లు, రెండు పరుగులు బాదడంతో కోల్కతా విజయం ఖాయమనే అనుకున్నారు. చివరి రెండు బంతులకు మూడు పరుగులు అవసరం కావడంతో కోల్కతా విజయం తథ్యమని భావించారు.
అయితే, సరిగ్గా ఇక్కడే కథ అడ్డం తిరిగింది. 15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరుగులు చేసిన రింకూ సింగ్ను, ఉమేశ్ యాదవ్ (0)ను స్టోయినిస్ వరుస బంతుల్లో పెవిలియన్ పంపడంతో కోల్కతా కథ ముగిసింది. మొత్తంగా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన కోల్కతా 208 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఫలితంగా ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్, మార్కస్ స్టోయినిస్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 May,2022 07:32AM