హైదరాబాద్: తెలంగాణలో తన పాదయాత్రను టీఆర్ ఎస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని వైఎస్ ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ క్రమంలోనే నర్సంపేటలో తనపై దాడి చేసి, తన వాహనాన్ని ధ్వంసం చేశారని చెప్పారు. ధ్వంసమైన వాహనంలో ప్రగతి భవన్ కు వెళ్తుండగా పోలీసులు తనను అరెస్ట్ చేసిన వైనం, తాను కూర్చున్న కారును టోయింగ్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన తీరుపై షర్మిల.. గురువారం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణను అఫ్గానిస్థాన్ మాదిరిగా మార్చేశారన్నారు. తాలిబాన్ల మాదిరిగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్లంతా తాలిబాన్లే అని ఎద్దేవా చేశారు. కేవలం ట్రాఫిక్ జామ్ కు కారణం అయిన కేసులో తనను అరెస్టు చేశారని, మహిళను అని కూడా చూడకుండా తాను కూర్చున్న కారును టోయింగ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి తనను పోలీస్ స్టేషన్ లో విచారించడంతో పాటు తన వెంట వచ్చిన కార్యకర్తలను పోలీసులు తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. ‘ఈ కేసులో సీఎం కేసీఆర్ సూచన మేరకు నన్ను రిమాండ్ చేయాలని పోలీసులు అనుకున్నారు. రిమాండ్ ఎందుకు చేస్తారు? నేనేమైనా నేరం చేశానా? నా నుంచి ఏమైనా ఆధారాలు సేకరించాలా? అందుకే జడ్జీ రిమాండ్ కు అనుమతించలేదు’ అని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm