హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆస్పరిలో రేణుకమ్మ పేరిట జయరాం కుటుంబం రూ.52.42 లక్షలతో 30.83 ఎకరాలను కొనుగోలు చేసిందని, అయితే ఈ భూమి కొనుగోలుకు సంబంధించి ఎలాంటి లెక్కలు చెప్పడం లేదని ఆరోపిస్తూ రేణుకమ్మకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిందంటూ గురువారం ఉదయం వార్తలు వినిపించాయి. ఈ తరుణంలో ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం తాజాగా స్పందిస్తూ తన భార్యకు ఐటీ శాఖ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని ఆయన తెలిపారు. తన భార్యకు ఐటీ నోటీసులు వచ్చాయంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని కూడా ఆయన మండిపడ్డారు. ఐటీ శాఖ నుంచి ఎలాంటి నోటీసులు జారీ కాకుండానే తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన తెలిపారు. ఒకే రోజున జయరాం భార్య, బంధువులు, సన్నిహితుల పేరిట 180 ఎకరాలు కొనుగోలు చేశారని, వాటిలో 30 ఎకరాలు రేణుకమ్మ పేరిట కొనుగోలు చేశారన్నది ఆ వార్తలోని ఆరోపణ. అయితే ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి నోటీసులు రాలేదంటూ జయరాం తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm