నవతెలంగాణ-హైదరాబాద్ : పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం ప్రకటించింది. నియోజకవర్గంలో 2వేల మందికి 3లక్షల చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్లు శాసనసభలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఈ సాయాన్ని 15 రోజుల్లో ప్రారంభిస్తామని ఇటీవల మహబూబ్నగర్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు దీనిపై శాసనసభలో నిధులు కేటాయిస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి కోటాలో మరో 25వేల మందికి ఆర్థికసాయం చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా మొత్తం 2.63లక్షల మందికి రూ.7,890 కోట్లు ఇవ్వనున్నట్లు హరీశ్ వెల్లడించారు. అలాగే బడ్జెట్లో రెండు పడక గదుల ఇళ్లకు రూ.12వేల కోట్లు కేటాయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 67,782 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని హరీశ్ రావు తెలిపారు. 32,218 ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm