- ట్రస్మా జిల్లా అధ్యక్షులు జయసింహ గౌడ్
నవతెలంగాణ: నవీపేట్: ప్రైవేట్ స్కూల్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ నోరు అడుపులోపెట్టుకొని మాట్లాడాలని ట్రస్మా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జయసింహ గౌడ్ హెచ్చరించారు. కరోనా సమయంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్య తో పాటుగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ పై రవీందర్ సింగ్ వ్యాఖ్యలు శోషణీయమని అన్నారు. మండల కేంద్రంలో నవీపేట్ ట్రస్మా ఆధ్వర్యంలో ఏర్పరచిన సమావేశంలో పాల్గొన్న అనంతరం జయసింహ గౌడ్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మరితో గత రెండు సంవత్సరాలుగా చదువులకు దూరం కావడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైందని, హై స్కూల్ విద్యార్థులు సహితం బేసిక్స్ మరచిపోయారని తెలిపారు. వరుసగా మూడవ సంవత్సరం కూడా విద్యా వ్యవస్థ చిన్నా భిన్నం అవుతుండడంతో విద్యార్థుల భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని స్కూల్స్ తెరవాలని ప్రభుత్వం పై ట్రస్మా ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం సూచించిన కరోనా నిబంధనలు పాటిస్తూ
ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ పూటకోమాట మాట్లాడుతూ తన ఇజ్జత్ ను తానే తీసుకున్నాడని, మరోసారి ప్రైవేట్ స్కూళ్లను విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నవీపేట్ ట్రస్మా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రావు, కార్యదర్శి రమణారావు, తదితరులు పాల్గొన్నారు.