హైదరాబాద్: తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో వెన్నెల సత్యం రచించిన నాన్న నానీలు పుస్తకావిష్కరణ ఎస్.ఎ రఘు అధ్యక్షతలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ రోజు ఉదయం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, ఆవిష్కర్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎన్. గోపి మాట్లాడుతూ వెన్నెల సత్యం సామాజిక స్పృహ ఉన్న కవి అని ఇప్పటికే అనేక ప్రక్రియల్లో బలమైన కవిత్వం రాస్తున్నాడని అన్నారు. నాన్న నానీల్లో నాన్న ఔన్నత్యాన్ని శిఖరాయమానం చేసాడన్నారు. అమ్మతో పోల్చితే నాన్న మీద కవిత్వం తక్కవే అని అందులో నానీల్లో ఏకవస్తువు నాన్న గా నానీల సంకలనం తెచ్చిన తొలి కవి వెన్నెల సత్యం అన్నారు. అమ్మానాన్నలు ఇద్దరిమీద నానీల సంపుటాలు తేవడం అభినందనీయమని అన్నారు. జీవన సారాన్ని పట్టి చూపిన నానీలు రాసాడని పేర్కొన్నారు.
సభాధ్యక్షులు కవి, విమర్శకులు ఎస్. రఘు మాట్లాడుతూ నాన్న నానీలు నాణ్యతలో ముందువరుసలో నిలుస్తాయని అన్నారు. ఒక్కో నానీ ఆణిముత్యంలా మెరిసి నానీల ఘనతను నిలబెట్టాయని అన్నారు. మంచి భావుకతతో కూడి, పాఠకులు తాదాత్మ్యం చెందేలా ఉన్నాయన్నారు. నేటినిజం పత్రిక సంపాదకులు బైస దేవదాస్ మాట్లాడుతూ తెలుగుసాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు వచ్చాయని కొన్ని మాత్రమే నిలబడ్డాయని పాతికేళ్లయినా నానీల ప్రభ ఇప్పటికీ తగ్గడంలేదన్నారు. దక్షిణాఫ్రికా ప్రవాసకవి రాపోలు సీతారామరాజు మాట్లాడుతున్న లుప్తమౌతున్న మానవీయ బంధాలను, నాన్న కోల్పోతున్న ఉనికిని అక్షరబద్దం చేసిన నానీలని అన్నారు. అత్మీయ అతిథి కుడికాల వంశీధర్ మాట్తాడతూ ఏక వస్తునానీలు రాయడం వెన్నెల సత్యానికి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు.
ప్రముఖ విమర్శకులు తంగిరాల చక్రవర్తి మాట్లాడుతూ విమర్శకు నిలబడే నానీలు రాసిన వెన్నెల సత్యం నిఖార్సయిన కవితా అభివ్యక్తితో రాస్తాడన్నారు. సభాసమన్వయం అనుముల ప్రభాకరా చారి చేయగా..ఈ కార్యక్రమంలో వెన్నెల సత్యం మాతృమూర్తి వడ్ల మోనమ్మ, వడ్ల రాజు, వడ్ల లక్ష్మి తెలుగుపూలతోట అడ్మిన్లు డా. జయప్రకాశ్, మంజుల కులకర్ణి, ముజాహిద్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి, నర్సింహ, కోట్ల నర్సిములు, వడిచర్ల సత్యం, గాజుల పవన్ కుమార్, రవి కుమార్, దండు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Nov,2022 04:59PM