- జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నవతెలంగాణ-కంటేశ్వర్
పోడు భూములకు సంబంధించిన ప్రక్రియను ఈ నెల 15 వ తేదీ లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా, నిర్దేశిత గడువుకంటే ముందే అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన వెంటనే అర్హులైన వారికి ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలను అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని అన్నారు. కలెక్టర్ అధ్యక్షతన బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మీటింగ్ హాల్ లో ఆర్ ఓ ఎఫ్ ఆర్ జిల్లా స్థాయి కమిటీ మలి విడత సమావేశం నిర్వహించారు.
పోడు భూములకు సంబంధించి వచ్చిన క్లెయిమ్ లు, క్షేత్ర స్థాయిలో జరిపిన పరిశీలన వివరాలు, గ్రామ సభల తీర్మానాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. డివిజనల్ స్థాయి కమిటీలో ఆమోదం పొందినప్పటికీ పలు సాంకేతిక కారణాలతో పెండింగ్లో ఉండిపోయిన క్లెయిమ్ లను రెండు రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీటితో పాటు తిరస్కరించిన క్లెయిమ్ లను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు లోబడి అర్హత కలిగి ఉన్న వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు.
జిల్లా స్థాయి కమిటీకి చేరిన నివేదికలను సత్వరమే పరిశీలన చేయాలని, క్లెయిమ్ ల ఆమోదం లేదా తిరస్కరణకు గురైన వాటికి సంబంధించి స్పష్టమైన ఆధారాలను పొందుపర్చాలని సూచించారు. క్లెయిమ్ ల పరిశీలన వివరాలను పక్కాగా ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా కంప్యూటరీకరించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణీత డిజైన్ లో పట్టా పాస్ బుక్కుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, బి.చంద్రశేఖర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగూరావు, ఆర్డీఓలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, అటవీ శాఖ అధికారులు, జిల్లా కమిటీ సభ్యులైన భీంగల్, మోపాల్, సిరికొండ మండలాల జెడ్పిటీసీలు చౌట్పల్లి రవి, కమలా బానోత్, మాలావత్ మాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 05:18PM