సమకాలీన తెలంగాణ ప్రసిద్ధ సాహితీవేత్తల్లో డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ ఒకరు. కాళోజీ పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి పురస్కారగ్రహీత, వివిధ ప్రక్రియల్లో అనేక రచనలు చేసిన అనునిత్య అక్షర కృషీవలుడు, వివాద రహితులు, సౌమ్యులు అమ్మంగి. ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలన్న ఉత్తమాదర్శానికి మంచి దాఖలా ఆయన. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు అభివర్ణించినట్టు 'అమ్మంగి ఒక ప్రశాంత సరోవరం!'. దశాబ్దాల సాహితీ జీవితంలో ఎందరో పెద్దలకు మిత్రులయ్యారు. మరెంతో మంది వర్ధమానులకు హితవరిగానూ మన్ననల్ని పొందారు. ఎప్పుడూ నిండుకుండవలె కనబడే అమ్మంగి రచనలపై ఇటీవలి కాలంలో ఒక సమగ్ర పరిశోధనాగ్రంథం వెలువడడం ఆయన మిత్రులు, అభిమానులకు ఆనందాన్ని కలిగించే పరిమాణం. ఈ పరిశోధనను విజయవంతంగా పూర్తిచేశారు డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు. ''అమ్మంగి వేణుగోపాల్ రచనలు - సమగ్ర పరిశీలన'' అన్న ఆయన సిద్ధాంత గ్రంథానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం పిహెచ్.డి. ప్రదానం చేసింది. ఉత్తమ అధ్యాపకులు, పరిశోధకులు డాక్టర్ తూర్పు మల్లారెడ్డి ఈ సిద్ధాంత గ్రంథ రచనకు సమర్థవంతమైన మార్గదర్శనాన్ని అందించారు.
తెలుగు సిద్ధాంత గ్రంథాల్ని గురించి కొన్ని ప్రశంసలతో పాటు మరికొన్ని విమర్శలూ వినిపించడం పరిపాటిగా ఉన్నదే. ప్రశంసల సంగతిని పక్కనబెట్టి విమర్శల్లోని ప్రధానాంశాల్ని పరిశీలిస్తే అందులో రెండు కీలకమైనవిగా కనబడతాయి. అందులో ఒకటి సిద్ధాంతగ్రంథ రచయిత వైఖరిలో అస్పష్టత, సందిగ్ధత ఉండడం. విషయాన్ని క్రమరీతిలో చెప్పే నేర్పు కొరవడడంతో ఈ బలహీనత పొడసూపుతుంది. ఇక రెండవ అంశం భాషాసంక్లిష్టతలు. అభివ్యక్తి సందర్భంలో సరియైనమాటల్ని వాడకపోవడం, మారుమూల పదాలను తరచుగా ప్రయోగించడం వంటివి భాషాసంక్లిష్టతల్ని పెంచిపోషిస్తాయి. అయితే పరిశోధకులు డాక్టర్ సూర్యప్రకాశ్ రావు ఈ రెండు బలహీనతల్ని అధిగమించారు. అందుకు ఆయన ప్రస్తుత వృత్తి, గతంలో కొనసాగించిన వృత్తి తాలూకు నేపథ్యం కారణమయ్యాయనిపిస్తుంది. సూర్యప్రకాశ్రావు ప్రస్తుతం పాఠశాల అధ్యాపకులు. ఏ రీతిలో చెబితే సుబోధకమవుతుందో ఆయనకు తెలుసు. గతంలో పాత్రికేయుడిగా పనిచేసినందువల్ల వచనంలో ధారాశుద్ధిని సాధించగలిగారు. ఆరు వందల పుటలు దాటిన ఈ సిద్ధాంతగ్రంథం పాఠకులను ఏకబిగిన చదివించగలదని వ్యాఖ్యానిస్తే అందులో అతిశయోక్తి లేదు. సూర్యప్రకాశ్ రావు ముమ్మాటికీ అభినందనీయులు.
ఎనిమిది అధ్యాయాల సిద్ధాంత గ్రంథమిది. ఇందులో తొలి అధ్యాయం జీవనరేఖల్ని పరిచయం చేసింది. రంగారెడ్డి జిల్లాలో ఒక సాధారణ ఆర్థిక స్థితిగతులున్న కుటుంబంలో జన్మించిన అమ్మంగి తనదైన సంయమన వైఖరి, ఆత్మవిశ్వాసాలు ఆలంబనలుగా ఎదిగిన తీరును సూర్యప్రకాశ్ రావు చక్కగా పరిచయం చేశారు. సాహితీ జగతిలో నిలదొక్కుకోవాలని తపన పడుతున్న 1960వ దశకం నాటి సగటు తెలంగాణ విద్యార్థి జీవితానికి అమ్మంగి ఒక ప్రతినిధి వంటివారు. ఒకవైపు అస్తిత్వ సమరాన్ని సాగిస్తూనే తన ప్రతిభాపాటవాలకు మెరుగులు దిద్దుకునే ఏ అవకాశాన్నీ అమ్మంగి విడిచిపెట్టలేదు. హుజురాబాదులో 1970లో ఆరంభమైన ఈ ఆదర్శ అధ్యాపకుడి వృత్తిజీవన పయనం డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్గా పదవీవిరమణ పొందడంతో విజయవంతంగా ముగిసింది. అయితే ఆయన సాహిత్య కృషి మాత్రం మరింత వన్నెలు దీరి చిగురించడం ఆరంభమైంది. ఈ విశేషాలన్నీ తొలి అధ్యాయంలో దొరుకుతాయి. ఇది ఆసక్తికరమైన అధ్యాయం.
అమ్మంగి అక్షరాక్షర కవి. ''వచనాన్నే కవిత్వం''గా రాసి కవిత్వమనే కవి కాదు. సాంద్రమైన అనుభూతిని అందించే కవిత్వమే ఆయన కలం నుండి వెలువడింది. ఇన్నిసంవత్సరాలుగా సాహిత్య రంగంలో ఉన్నప్పటికీ ఈ పరిశోధనాకాలం నాటికి ఆయన ప్రచురించిన కవితాసంపుటాలు మూడంటే మూడే (మిణుగురు, పచ్చబొట్టు పటంచెరు, భరోసా). సూర్యప్రకాశ్ రావు 'కవిగా అమ్మంగి వేణుగోపాల్'ను విశ్లేషించేందుకు రెండవ అధ్యాయంలో ప్రయత్నం చేశారు. రమారమి సిద్ధాంత గ్రంథంలోని సగభాగమంతా (పుట 45 నుండి 300 వరకు) ఈ అధ్యాయం ఉంది. ప్రామాణికత, సమగ్రతలు పరిశోధనకు ప్రాణవాయువులనే సత్యం సూర్యప్రకాశ్రావుకు తెలుసునని ఈ అధ్యాయం నిరూపించింది. ఆయన భవిష్యత్తులో కవిత్వ విమర్శలోనే కొనసాగితే మనకొక మంచి విమర్శకుడు లభించినట్టు అవుతుంది! కవి రచించిన పంక్తుల్ని ఉటంకిస్తూ వెళ్ళిపోవడమే కనిపించే తరుణంలో అత్యంత నిశితమైన విశ్లేషణతో ముందుకు వచ్చారు సూర్యప్రకాశ్ రావు. ఈ అధ్యాయంలో వేణుగోపాల్ కవిత్వాన్ని సమీక్షిస్తూ సూర్యప్రకాశ్ రావు స్పృశించని అంశం లేదు. ''వస్తు వైవిధ్యం, ఉద్యమాల ప్రభావం, భాషాప్రయోగాలలో నవ్యత, ఆలంకారికతలు అమ్మంగి కవిత్వంలో పుష్కలంగా ఉంటాయ''ని సూర్యప్రకాశ్ రావు నిగ్గుదేల్చారు. వస్తు, శిల్ప వైవిధ్యాన్నివివరించడంలో పరిశోధకుడి ప్రతిభ ప్రస్ఫుటంగా కనబడుతుంది. భాష, అలంకారం, రసం వంటి లోతైన అంశాల్ని లోతైన రీతిలోనే సూర్యప్రకాశ్ రావు విశ్లేషించారు. అమ్మంగి కవిత్వాన్ని విభజించిన తీరు స్పష్టతకు నిదర్శనం. ఆయన కవిత్వంలోని సాధారణ వస్తువులతో పాటు శాస్త్ర విజ్ఞాన చిత్రణ, ఆశావాదం, నిరాశావాదం, పర్యావరణం, విపత్తుల చిత్రణ వంటివి కూడా ఎట్లా కనిపిస్తాయో వివరించారు. ''భిన్నమైన వస్తువులతో భిన్నంగా రాసే కవి వేణుగోపాల్'' అన్న వ్యాఖ్య నూరు శాతం నిజమేనని ఈ అధ్యాయాన్ని చదివిన తరువాత అర్థమవుతుంది.
''విమర్శ రీతుల వినియోగం, సాహిత్య సిద్ధాంతాలను ఉపయోగించడం, ప్రాచ్య- పాశ్చాత్య సాహిత్య వాదుల అభిప్రాయాన్ని వెల్లడించడం'' పునాది ఆధారాలుగా అమ్మంగి పరిశోధనాప్రస్థానం కొనసాగిందన్నది పరిశోధకుడి అంచనా. మూడవ అధ్యాయం ఆయన పరిశోధనలకు ఉద్దేశించింది. ప్రసిద్ధ రచయిత గోపీచంద్ నవలల్ని గురించి వేణుగోపాల్ చేసిన పరిశోధన ఉల్లేఖనీయమైనది. దాన్ని వైవిధ్యభరితంగా పరిశోధకుడు వివరించారు. ''అమ్మంగి స్వభావరీత్యా వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ లక్షణమే ఆయన పరిశోధనలోనూ ప్రతిబింబించింది'' అని పరిశోధకుడు వ్యాఖ్యానించారు. అసమర్థుని జీవయాత్రను వేణుగోపాల్ సమర్థవంతంగా ఆవిష్కరించిన తీరు; మెరుపుల మరకలు నవలకు, ది రేజర్స్ ఎడ్జ్కీ పోలిక చూపిన పద్ధతి; గోపీచంద్ మీద వివిధ ప్రభావాల్ని వేణుగోపాల్ వెలుగులోకి తెచ్చిన విధానం - వీటన్నింటినీ ఈ అధ్యాయంలో చక్కగా తెలియజేశారు.
నిరాడంబర విమర్శకుడు వేణుగోపాల్. రా.రా.వంటి వారికి పూర్తిగా భిన్నమైన సాత్త్విక మార్గం ఆయన సొంతం. నాటి 'అవినాభావం'తో ఆరంభమైన అమ్మంగి ముద్ర ఇప్పటికీ బలంగానే ఉంది. అందరూ చెబుతున్నవాటినే కాకుండా అత్యంత వైవిధ్యభరితమైన అంశాన్ని తన సాహిత్య విమర్శనాంశంగా స్వీకరించడం అమ్మంగి పద్ధతి. ఈ కోణంలో చూసినపుడు ఆయనకూ ఆచార్య కె.కె.రంగనాథాచార్యులకూ కొన్ని పోలికలు కనబడతాయి. సూర్యప్రకాశ్ రావు సిద్ధాంతగ్రంథంలోని నాలుగవ అధ్యాయం సాహిత్య విమర్శకుడిగా అమ్మంగి ప్రత్యేకతల్ని చెబుతుంది. ''వ్యాసారంభంలోనే వ్యాసంలోని విషయం పట్ల పాఠకుడిలో అవగాహన కలిగించే నేర్పు వేణుగోపాల్ విమర్శల్లో ఉంటుంది'' అన్న అభిప్రాయం ఎంతో సరియైనది.
కవి, పరిశోధకుడు, విమర్శకుడిగా ప్రసిద్ధులైన వేణుగోపాల్ సృజనాత్మక ప్రక్రియల్లోనూ రచనలు చేసిన సత్యాన్ని సూర్యప్రకాశ్ రావు బలంగా తెలియజేయగలిగారు. నాటికలను, కథానికలను ఆయన రచించినా అవి ఎక్కువగా ప్రచారాన్ని పొందలేదు. ఈ రెండు ప్రక్రియల్లోనూ అమ్మంగి రచనావిన్యాసాన్ని సూర్యప్రకాశ్ రావు రెండు అధ్యాయాల్లో పరిచయం చేశారు. పలు సంకలనాల సంపాదకుడిగా అమ్మంగి నిశ్శబ్ద కృషిని మరొక అధ్యాయంలో తెలియజేశారు. ప్రసిద్ధ పరిశోధకులు డాక్టర్ పి.వి.పరబ్రహ్మ శాస్త్రి, డాక్టర్ ఎన్.ఎస్. రామచంద్ర మూర్తి రచించిన 'తెలుగు స్క్రిప్ట్- ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్' గ్రంథాన్ని 'తెలుగు లిపి - ఆవిర్భావ వికాసాలు' అనే పేరుతో వేణుగోపాల్ చక్కటి శైలిలో అనువదించారు. ఉర్దూ నుండీ కొన్ని అనువాదాలున్నాయి. ఆయన అనువాద కృషిని చివరి అధ్యాయంలో చేర్చారు సూర్యప్రకాశ్ రావు.
అయితే ''వేణుగోపాల్ రచనల విజ్ఞాన సర్వస్వం'' అనదగిన ఈ సిద్ధాంతగ్రంథ రచనను అభినందిస్తూనే ఒకటి రెండు చిన్న చిన్న లోపాల్ని కూడా చెప్పడం తప్పనిసరి అవసరం. కొన్ని అధ్యాయాల్లో చర్విత చర్వణమనిపించే సంప్రదాయ భావనల్ని పరిచయంలో చేర్చారు. ఉదాహరణకు - కవిత్వ నిర్వచనం, విమర్శావికాసం వంటివి. ఇవి చేర్చకపోయినా లోపమేదీ ఉండకపోయేది. కవిత్వ విశ్లేషణ చేసిన అధ్యాయంలో కవితాపంక్తులు కొన్ని సుదీర్ఘంగా కనబడతాయి. అంతటి పొడవైన కవితాపంక్తుల్ని ఉటంకించడం అవసరం లేదేమో! ఇట్లా కొంత ఎడిటింగ్ జరిగిఉంటే సిద్ధాంత గ్రంథ నిడివి తగ్గి ఉండేది. రచన మరింత అందంగా కనిపించేది. చిత్తశుద్ధికి ప్రతిరూపమైన ఒక సాహితీవేత్త యావత్ సాహిత్య సృజనను గురించి ఒక వర్ధమాన పరిశోధకుడు అదే స్థాయి చిత్తశుద్ధితో చేసిన ఈ పరిశోధన ఎంతో విలువైనది. సిద్ధాంత గ్రంథ రచనకు నమూనాగా నిలవదగినది.
'అమ్మంగి వేణుగోపాల్ రచనలు - సమగ్ర పరిశీలన', రచయిత : డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు, పేజీల సంఖ్య : 610, వెల : రూ. 375.
- డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి,
9866917227
Authorization