(నిన్నటి తరువాయి)
దేవాదుల ఎత్తిపోతల పథకం
వరంగల్ జిల్లాలోని కరువు ప్రాంతాలకు సాగునీటిని అందించడానికి ఈ ప్రాజెక్టును చేపట్టారు. దీన్ని గోదావరి నదిపై ఏటూరు నాగారం మండలంలోని దేవాదుల, గంగారం గ్రామాల వద్ద నిర్మిస్తున్నారు. దీన్ని 'జె.చొక్కారావు గోదావరి జలాల ఎత్తిపోతల పథకం' అని కూడా పిలుస్తారు. ప్రాజెక్టులో భాగంగా 238 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకెళ్లడం భారతదేశంలో ఇదే మొదటిసారి. ఈ ప్రాజెక్టును మూడు దశలుగా నిర్మిస్తున్నారు. దీని ఆయకట్టు1.2 లక్షల ఎకరాలు. ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందే జిల్లాలు వరంగల్, కరీంనగర్, నల్గొండ.
దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం
గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించే రెండో భారీ నీటి పారుదల ప్రాజెక్టు ఇది. గోదావరి నదిపై ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం వద్ద ఈ బ్యారేజీని నిర్మించడానికి ప్రతిపాదించారు. నాలుగు దశల్లో ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి 119 టి.ఎమ్.సి.ల నీటిని నాగార్జునసాగర్ టేల్పాండ్కు తరలిస్తారు. ఈ ప్రాజెక్టు వల్ల ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. గోదావరి జలాలు ఈ ప్రాజెక్టు నుంచి సాగర్ టేల్పాండ్ వరకు 291 కిలోమీటర్ల దూరం వెళతాయి. దీని లింకు కాల్వల్లో కిన్నెరసాని, ముర్రేడువాగు, మున్నేరు, పాలేరు, మూసీ నదులు కలుస్తాయి.
ఎల్లంపల్లి (శ్రీపాదసాగర్) ప్రాజెక్టు
నక్సల్స్ చేతిలో హత్యకు గురైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు పేరుతో ఉన్న ఈ ప్రాజెక్ట్కు నిర్మాణానికి 2004 జూలై 28న శంకుస్థాపన చేశారు. సర్ ఆర్థర్ కాటన్ గోదావరిపై ఎల్లంపల్లి వద్ద బ్యారేజి నిర్మాణానికి 100 ఏళ్ల కిందటే ప్రతిపాదన చేశారు. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు.
గోదావరి నదిపై కరీంనగర్ జిల్లా రామగుండం మండలం లోని ఎల్లంపల్లి సమీపంలో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ జిల్లాల్లోని సుమారు 5 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సాగునీరు అందుతుంది. దీంతో పాటు రామగుండం ఎన్టీపీసీకి అవసరమైన 6.5 టి.ఎమ్.సి.ల నీటిని అందించవచ్చు.
రాజోలిబండ డైవర్షన్ స్కీం
మహబూబ్నగర్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లో రాజోలిబండ డైవర్షన్ స్కీం ఒకటి. దీన్ని సంక్షిప్తంగా 'ఆర్డీఎస్' అంటారు. దీన్ని కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంయుక్తంగా తుంగభద్ర నదిపై కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో నిర్మించాయి. ఈ ప్రాజెక్టు కాలువ ద్వారా మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల, అలంపూర్ ప్రాంతాల్లో 87,500 ఎకరాలకు సాగునీరు అందించడానికి ఏర్పాటు చేశారు.
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు
నల్గొండ జిల్లాకు సాగునీటితో పాటు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఎస్ఎల్బీసీగా పిలిచే ఈ ప్రాజెక్టును 1983లో నాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రారంభించారు. 2,70,000 ఎకరాలకు సాగునీరు అందించాలనేది దీని ప్రధాన లక్ష్యం. ఎలిమినేటి మాధవరెడ్డి కాలువను 2006 సెప్టెంబర్ 26న జాతికి అంకితం చేశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నుంచి రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందిస్తున్నారు.
ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి
గోదావరి ఉపనది అయిన ప్రాణహితపై ఆదిలాబాద్ జిల్లా, కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల వరకు 160 టి.ఎమ్.సి.ల నీటిని తీసుకెళ్లడం దీని ప్రధాన లక్ష్యం. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. దీని వల్ల మహారాష్ట్రలోని కొంత భాగం ముంపునకు గురవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు డిజైన్లో కొన్ని మార్పులు చేసింది. గోదావరి నదిపై కాళేశ్వరం సమీపంలో మేడిగడ్డ లేదా ఇచ్చంపల్లి వద్ద నిర్మించడానికి సర్వే మొదలుపెట్టారు. దీన్ని 'డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేవెళ్ల సుజల స్రవంతి'గా వ్యవహరిస్తున్నారు.
ఇచ్చంపల్లి ప్రాజెక్టు: గోదావరి ఉపనది అయిన ఇంద్రావతి గోదావరితో కలిసిన తర్వాత 12 కి.మీ. దూరంలో కరీంనగర్ జిల్లా, మహదేవ్పూర్ మండలంలోని 'ముకునూరు' గ్రామం వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించాలని స్వాతంత్య్రానికి ముందే నిర్ణయించారు. కానీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. 1975లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య దీనికి సంబంధించి ఒప్పందాలు కూడా కుదిరాయి. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు.
వట్టివాగు ప్రాజెక్టు: ఇది ఆదిలాబాద్లోని వట్టివాగుపై నిర్మించిన మధ్య తరహా ప్రాజెక్టు. దీని ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 9918 హెక్టార్లకు సాగునీరు అందిస్తున్నారు.
బొగ్గులవాగు ప్రాజెక్టు: ఇది కరీంనగర్ జిల్లాలోని రుద్రారం వద్ద బొగ్గులవాగుపై నిర్మించిన మధ్య తరహా ప్రాజెక్టు. దీన్ని 1976-77లో ప్రారంభించి 1987లో పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 8 గ్రామాల్లో 5,150 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు.
సాత్నాల వాగు ప్రాజెక్టు: ఇది ఆదిలాబాద్ జిల్లాలోని కప్నా గ్రామంలో రాళ్లవాగుపై నిర్మించిన మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టు. ఇది దాదాపుగా 24,000 ఎకరాలకు నీటి పారుదల సౌకర్యాన్ని కల్పిస్తోంది.
స్వర్ణ ప్రాజెక్టు: ఆదిలాబాద్లోని 'జాలి' గ్రామం వద్ద గోదావరి ఉపనది అయిన స్వర్ణనదిపై ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఇది సుమారు 10,000 ఎకరాలకు సాగునీరు అందిస్తోంది.
సింగూర్ డ్యామ్: మెదక్ జిల్లాలోని సంగారెడ్డి పట్టణానికి సమీపంలో మంజీరా నదిపై నిర్మించిన బహుళార్థక మధ్య తరహా ప్రాజెక్టు ఇది. దీనికి 30 టి.ఎమ్.సి.ల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఇది హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించడంతో పాటు విద్యుత్ శక్తి ఉత్పతి కేంద్రంగానూ ఉంది.
డిండి ప్రాజెక్టు: నల్లగొండ జిల్లాలోని డిండి పట్టణ సమీపంలో కృష్ణానది ఉపనది అయిన డిండిపై 1943లో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఈ రిజర్వాయర్ కింద నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో సుమారు 12,500 ఎకరాల ఆయకట్టు ఉంది.
ఆసిఫ్ నహర్ ప్రాజెక్టు: నల్గొండ జిల్లాలోని వలిగొండ మండలం నెమలి కాల్వ గ్రామం వద్ద మూసీనదిపై దీన్ని నిర్మించారు. సుమారు 15,246 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 1905లో ఈ ప్రాజెక్టును నిర్మించారు. కానీ గత 20 ఏళ్లుగా ఇది 10,000 ఎకరాలకు మాత్రమే నీటిని అందించగలుగుతోంది.
కడెం ప్రాజెక్టు: ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి ఉపనది అయిన కడెం నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. దీని సామర్థ్యం 13.243 టి.ఎమ్.సి.లు.
లెండి ప్రాజెక్టు: ఇది మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్పై ఆధారపడి మహారాష్ట్రలోని ముఖెడ్ తాలూకాలో 'గోజిగాన్' గ్రామంలో దీన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్ జిల్లాలోని 31 గ్రామాల్లో 22,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని తెలంగాణ, మహారాష్ట్ర 38:62 నిష్పత్తిలో పంచుకున్నాయి. నీటిని కూడా ఇదే నిష్పత్తిలో వాడుకుంటాయి.
మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్: మహబూబ్నగర్ జిల్లా, కొల్లాపూర్ మండలంలోని రేగిమంగడ్డ గ్రామ సమీపంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా జిల్లాలోని కరువు ప్రాంత పంట పొలాలకు నీటిని అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా 2.5 టి.ఎమ్.సి.ల సాగునీరు, 3.2 లక్షల మందికి తాగునీరు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
శ్రీ కొమరం భీం ప్రాజెక్టు: ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం 'అడ' గ్రామ సమీపంలో పెద్దవాగుపై ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.
మాదిరి ప్రశ్నలు
1. జూరాల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
డి) మహబూబ్నగర్ సి) నల్గొండ
బి) ఆదిలాబాద్ ఎ) నిజామాబాద్
2. నిజాంసాగర్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
ఎ) మూసీ బి) మంజీర
సి) శబరి డి) కిన్నెరసాని
3. పోచంపాడు ప్రాజెక్టు పేరేమిటి?
ఎ) సింగూరు బి) జూరాల
సి) శ్రీరామ్సాగర్ డి) భీమ
4. తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన నీటి కాలువ?
ఎ) సరస్వతి
బి) కాకతీయ
సి) ఎన్టీఆర్ కాలువ
డి) జవహర్ లాల్ నెహ్రూ కాలువ
5. ప్రపంచంలో కెల్లా అత్యంత పొడవైన రాతి ఆనకట్ట ఉన్న ప్రాజెక్టు ఏది?
ఎ) నాగార్జునసాగర్ బి) శ్రీరామ్సాగర్
సి) నిజాంసాగర్ డి) జూరాల
6. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
ఎ) ఆదిలాబాద్ బి) నల్గొండ
సి) కరీంనగర్ డి) నిజామాబాద్
7.ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
ఎ) గోదావరి బి) మంజీర
సి) కృష్ణ డి) తుంగభద్ర
8. కిందివాటిలో ఏ ప్రాజెక్టును స్వాతంత్య్రానికి ముందే నిర్మించారు?
ఎ) శ్రీరాంసాగర్ బి) నిజాంసాగర్
సి) నాగార్జునసాగర్ డి) ప్రియదర్శిని
9. సింగూర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు?
ఎ) కృష్ణ నది బి) మంజీరా నది
సి) గోదావరి డి) కడెం
10. కంతనపల్లి సుజల స్రవంతి పథకాన్ని ఏ నదిపై చేపడుతున్నారు?
ఎ) మూసీ బి) కడెం
సి) కృష్ణా డి) గోదావరి
11. ఏ పథకాన్ని 'డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సుజల స్రవంతి'గా వ్యవహరిస్తున్నారు?
ఎ) దుమ్ముగూడెం
బి) కంతనపల్లి సుజల స్రవంతి
సి) ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు
డి) ఎల్లంపల్లి ప్రాజెక్టు
12. అలీసాగర్ ఎత్తిపోతల పథకం ఏ జిల్లాకు సంబంధించింది?
ఎ) ఆదిలాబాద్ బి) కరీంనగర్
సి) మహబూబ్నగర్ డి) నిజామాబాద్
13. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏ జిల్లాలో ఉంది?
1) మహబూబ్నగర్ 2) నల్గొండ
3) నిజామాబాద్ 4) మెదక్
సమాధానాలు
1. ఎ 2. బి 3. సి 4. బి 5. ఎ
6. డి 7. సి 8. బి 9. బి 10. డి
11. సి 12. డి 13. ఎ