Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె అడుగు పెడితే నేలమ్మ పులకరించిపోతుంది. ఆమె స్వేదంతో తడిసి కొత్త పరిమళాన్ని అందిస్తుంది. ఆమె లేకుంటే వ్యవసాయమే లేదు. ఇంటెడు చాకిరి చేస్తుంది. పొద్దంతా చెమట చిందించి సాగు చేస్తుంది. అవసరమైతే అరకపడుతుంది. నాట్లు వేయడం, కలుపు తీయడం, కోతలు కోయడం, నూర్పిడి చేయడం, పంట ఇంటికి చేర్చడం... ప్రతి పనిలో ఆమె వుంది. అయినా ఆమె శ్రమకు విలువ లేదు. సొంత భూమి లేదు. రైతుగా గుర్తింపు లేదు. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో జరిగిన మహిళా రైతు సదస్సులో కొందరు మహిళా రైతులు తమ ఆవేదనను మానవితో ఇలా పంచుకున్నారు.
మహిళలు ఇంటి పనులతో పాటు ఎంతో కష్టంతో కూడిన పనులు చేస్తున్నారు. వ్యవసాయంలో విత్తడం, నాటు పెట్టడం, కలుపు తీత, అంతరకృషి, పంటకోత, పంట నూర్పిడి, వ్యవసాయోత్పత్తుల శుద్ధి, వంట చెరకు సేకరణ, పశుపోషణ, నీటిని తెచ్చే పని, ఇంటి పని, వంట, పిల్లల పోషణ, పాడి పశువుల పోషణ ఇలా వ్యవసాయ సంబంధిత రంగాలలో పని చేస్తున్నారు. దాంతో శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారు. అనేక అనారోగ్యాలకు గురౌతున్నారు. ఈ పనులు మహిళలు తరతరాలుగా చేస్తూనే వున్నారు.
చట్టాన్ని మార్చాలి
వ్యవసాయంలో అన్ని పనులు తానై చేస్తున్నా రైతు అనగానే పురుషులేనని భావిస్తూ మహిళల్ని వారికి తోడ్పడే వారిగానే చూస్తున్నారు. వ్యవసాయంలో కీలకంగా మారుతున్న మహిళల పాత్రను గుర్తించి ఈ భావాన్ని పోగొట్టాలి. దీనికోసం పురుష రైతులకు కల్పించే అన్ని ప్రభుత్వ పథకాలు మహిళా రైతులకు కూడా వర్తింపజేయాలి. చట్టపరమైన మార్పులు తేవాలి. ప్రభుత్వ ప్రయోజనాలన్నీ మహిళలకు అందేలా అన్ని రెవెన్యూ రికార్డుల్లో పురుషులతో పాటు మహిళల పేర్లు కూడా నమోదు అయ్యేలా చట్టాన్ని మార్చాలి. వ్యవసాయ మహిళల సామర్ధ్యం పెరగందే వ్యవసాయ ఉత్పాదన పెరగదు. అందువల్ల మహిళల్లో సాంకేతిక సామర్ధ్యాన్ని పెంచటానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.
గుర్తింపు లేదు
మహిళలు ఎన్నో విధాలు గా ఇబ్బందులు పడుతున్నారు. పొద్దున ఐదు గంటలకు లేచి ఇంట్లో పనులన్నీ చేసి పొలం పనులకు వెళతారు. పంటలు పండిం చడానికి ప్రభుత్వం నుండి సరైన సాయం అందడం లేదు. ఎన్ని సాధించినా మహిళలను తక్కువగానే చూస్తు న్నారు. ఇంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని పిల్లల్ని పోషించు కోడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అసలు వ్యవసాయం చేసే మహిళలను రైతుగానే గుర్తించడం లేదు. వ్యవసాయంలో అన్ని రకాల పనులు మహిళలు చేస్తారు. మహిళలకు గుర్తింపు ఇవ్వాలి. అదే మేము ప్రభుత్వం నుండి కోరుకుం టున్నాం.
- కుమారి,భద్రాద్రి కొత్తగూడెం
మా భూమి మాకు కావాలి
మాకు ఓ ఎకరం సొంత పొలం వుంది. ఆ వచ్చే ఆదాయంతో ఇల్లు గడవదు. అందుకే కూలి చేసుకుంటాం. అగ్రకుల పెత్తందార్లు మా పొలాన్ని మాకు కాకుండా చేస్తున్నారు. మా తాతల కాలం నుండి ఆ పొలం మేమే పండించుకుంటున్నాం. పన్నెండేండ్ల నుండి దాని కోసం పోరాటం చేస్తూనే వున్నాం. ప్రభుత్వం మా స్థలం మాకు ఇవ్వాలి. మా పేరుతో కాగితాలు కూడా ఉన్నాయి. కస్తూరి బాయి స్కూల్కు, డబుల్ బెడ్రూంకి మా స్థలాలు ఇచ్చాం. కలెక్టర్ మేము ఇచ్చిన భూమికి మళ్ళీ భూమి ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పొలం కోసమే పోరాడుతున్నాం.
- అబ్బవ్వ, బోధన్ మండలం, హమ్దాపూర్
కూలి రేట్లు పెంచాలి
మాకు సొంత పొలం అంటూ లేదు. కూలి పనులే చేసుకుంటాం. నార్లు, కలుపులు అయిపోయాయంటే పనులు ఏమీ వుండవు. తర్వాత ఖాళీగానే ఉంటాం. మగవాళ్ళు చేయాలన్నా పనులు దొరకవు. ఇప్పుడు మాది మున్సిపాల్టీలో కలిసింది. దాంతో ఉపాధి హామీ పథకం కూడా లేదు. ఇక ఆ పని కూడా పోయినట్టే. ఉండటానికి ఇల్లు లేవు. సొంత భూమి లేదు. కూలీ చేసి బతకడం తప్ప వేరే మార్గం లేదు. ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం లేదు. పిల్లల్ని ఎలా సాదుకోవాలి. మేం ఎలా బతకాలి. కూలి రేట్లు పెంచాలి. ఆడవాళ్ళకు 250, 200 కూలి ఇస్తున్నారు. మగవాళ్ళకు 300 ఇస్తారు. ఎండలు వస్తే కూలీ తగ్గిపో తుంది. కూలిలో కూడా తేడాలు చూపిస్తున్నారు.
- కె.లింగామణి, నర్సాపూర్
మహిళల కష్టాన్ని గుర్తించాలి
రైతు సమస్యలపై చాలా పని చేశాం. 1994లో సర్పంచ్గా చేశాను. వ్యవసాయం చేసే మహిళలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఐదు గంటకు లేవాలి. ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి. తర్వాత పొలంలో చేయాలి. కానీ విలువ లేదు. రైతుగానే గుర్తించరు. ఇంకా ఇంకా పండించాలనే కోరిక మహిళలకు బాగా ఉంటుంది. ఇంట్లో మగవాళ్ళు బాధ్యతగా ఉండరు. అలాంటప్పుడు ఇటు ఇంటి పనులు అటు పొలం పనులు అన్నీ మహిళలే చూసుకోవాలి. ఎంతకష్టపడినా భూమి మాత్రం మహిళల పేరుతో ఉండదు. పిల్లల చదువులు, ఖర్చులు ఎన్నో ఉంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా మహిళలు వ్యవసాయం చేస్తూనేవున్నారు. ప్రభుత్వం మహిళల కష్టాన్ని గుర్తించాలి. మహిళలు బాధపడుతూ ఇంట్లో కూర్చోకుండా పోరాడాలి. సమస్యలు పరిష్కరించుకోవాలి.
- విజయమ్మ, పోతిరెడ్డి పల్లి,కల్వకుర్తి తాలుక