Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భ్రమల బడ్జెట్ : భట్టి
అసెంబ్లీతోపాటు శాసనమండలిలో బుధవారం విభిన్నమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు నడిచాయి. ప్రశ్నోత్తరాలు, పద్దులపై చర్చ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ భ్రమల బడ్జెట్ అని విమర్శించారు. ఆ సమయంలో అధికార టీఆర్ఎస్ సభ్యులు పదే పదే అభ్యంతరం చెప్పడంతో సభా నిర్వహణ సరిగ్గా లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. సభలో లేని వ్యక్తుల ప్రస్తావన చేయరాదని అధికార పక్ష సభ్యులు కోరగా, అందుకు భట్టి స్పందిస్తూ చేవెళ్ల ఎంపీ రంజీత్రెడ్డి ఎంపీనా, ఆ విషయం తనకు తెలియదని చెప్పడం కొసమెరుపు. కాగా రెండు రోజుల క్రితం మండలిలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పంచాయతీ కార్మికులపై చర్చపెట్టగా, సీఎం ఆదేశాల మేరకు కౌన్సిల్ హాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీని కలిసి జీవో నెంబరు 51 ఎక్కడ అమలుకావడం లేదో చెబితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాగా మెట్రో రైల్కు కేంద్రం నిధులు కేవలం 10 శాతమేనని అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రకటించడం గమనార్హం.
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్ పూర్తిగా ప్రజల్ని భ్రమల్లో ముంచిందే తప్ప, ఎక్కడా వాస్తవ పరిస్థితి లేదని కాంగ్రెస్ శాసనసభాపక్షనేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆర్థికమాంద్యం ఉందంటూనే రూ.1.82 లక్షల కోట్లతో గత బడ్జెట్ కంటే 29 శాతం పెంచి చూపడం విడ్డూరంగా ఉందన్నారు. బుధవారం శాసనసభలో బడ్జెట్పై సాధారణ చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. పన్నేతర ఆదాయంగా రూ.30,600 కోట్లు, భౌతికలోటుగా రూ.33 వేల కోట్లు చూపారనీ, దీన్ని ఎలా భర్తీ చేస్తారో వివరణ ఇవ్వలేదనీ అభ్యంతరం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అప్పులు, మద్యం అమ్మకాల్లో తప్ప ఎక్కడా వృద్ధిరేటు కనిపించట్లేదని ఆక్షేపించారు. సంక్షేమం పేరుతో రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లతో పోలిస్తే మద్యం అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయమే అధికంగా ఉందన్నారు. 2018-19లో మద్యం ఆదాయం రూ.12వేల కోట్లు ఉంటే, 2019-20లో రూ.16వేల కోట్లకు పెరిగిందని వివరించారు. ప్రజల్ని మద్యం మత్తులో ముంచుతున్నారనీ, ఆ మత్తులోనే రాష్ట్రంలో దురాగతాలు జరుగుతున్నాయనీ ఆందోళన వ్యక్తం చేశారు. రాజీవ్ స్వగృహ ఇండ్లను అమ్మాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనీ, వాటిని సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కేటాయించాలనీ చెప్పారు. 2007-08లో అప్పటి ప్రభుత్వం వేలం వేసిన భూముల వివరాలు తెప్పించుకొని, వాటిలో డబ్బు చెల్లించని, పనులు చేపట్టని కంపెనీలు, సంస్థల నుంచి రికవరీ చేసుకోవాలనీ సూచించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎమ్ఎస్ఎమ్ఈ)కు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ జాబితా ప్రకారం రాయితీలు ఇవ్వట్లేదనీ, కేవలం పలుకుబడి ఉన్న వ్యక్తులు, కంపెనీలకే రాయితీలు చెల్లిస్తున్నారంటూ కొన్ని పేర్లు చదివి వినిపించారు. అలాగే కోళ్ల మొక్కజోన్న దాణాకు సంబంధించి భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రాజరాజేశ్వరీ హేచరీస్, వెంకటేశ్వర హేచరీస్ పేర్లను ప్రస్తావించారు. వీటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు యూనివర్సిటీలను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నారనీ, పోరాటాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ సహా అన్నింటా వైస్ ఛాన్సలర్లు, సిబ్బంది నియామకాలు జరగలేదని అన్నారు. ఉన్నతవిద్యకు రూ.1,723 కోట్లు కేటాయించారనీ, ఈ సొమ్ము ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతుందన్నారు. ఓయూలో రీసెర్చ్ స్కాలర్స్ పూట గడవడం కోసం కేటరింగ్ సర్వీసులకు వెళ్తున్నారనీ, గ్రూప్-1, 2 నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ 111 జీవో పరిధిలో ఉన్నాయనీ, వాటిలోకి నీటి ప్రవాహాన్ని నిలిపివేసి, అక్రమణలకు పాల్పడుతున్నారనీ, దానిలో ప్రభుత్వ పెద్దలు అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. 2020-21 నాటికి కార్పొరేషన్లకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలతో కలిపి మొత్తం అప్పు రూ.3.19 లక్షల కోట్లు అనీ, ఈ భారాన్ని 40 ఏండ్లపాటు ప్రజలపై వేశారనీ చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ అప్పులకు వడ్డీగా రూ.14,500 కోట్లు చెలించారనీ, అసలు రూ.6వేల కోట్లు చెల్లించారనీ వివరించారు.
మీరు చేస్తే ఒప్పు..మేం చేస్తే తప్పా?
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేశాక, సీఎం కేసీఆర్ తమపై అనేక ఆరోపణలు చేశారనీ, వాటిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందంటూ మల్లు భట్టివిక్రమార్క అసెంబ్లీలో అన్నారు. దీనిపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి జోక్యం చేసుకొని,సీఎం సభలో లేనప్పుడు ఎలా మాట్లాడతారంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. ''మేం సభలో లేనప్పుడు సీఎం మా గురించి ఎలా మాట్లాడారు? మీరు చేస్తే ఒప్పు...మేం చేస్తే తప్పా?'' అని భట్టి ప్రశ్నించారు. స్పీకర్ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
మీరేం చేశారు?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం పారిశ్రామికంగా చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ శాసనసభాపక్షనేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలే హైటెక్ సిటీ ఫేజ్-1,2 పూర్తిచేశాయనీ, ఇప్పుడున్న పారిశ్రామిక క్లస్టర్లు కూడా అప్పటివేననీ, ఫైనాన్షియల్సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉమ్మడి రాష్ట్రంలో కట్టినవేననీ అన్నారు. తమపార్టీ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన నియోజకవర్గంలో మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికీ నల్లాలు ఇచ్చినట్టు సంతకం చేసి ఇచ్చారని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పడాన్ని భట్టి విక్రమార్క తప్పుపట్టారు.