Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత దేశ సినీ చరిత్రలో అందరూ గర్వించదగిన నటి, గాయని, నిర్మాత కృష్ణవేణి అని అన్నారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ అనిల్ కూర్మ చలం.
ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో శుక్రవారం ఆకృతి- ఘంటసాల శతాబ్ది పురస్కారాన్ని సుప్రసిద్ధ సినీ నటి, గాయని, నిర్మాత సి.కృష్ణ వేణికి ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అనిల్ కూర్మ చలం మాట్లాడుతూ, 'ఎన్టీఆర్ లాంటి మహానటుడుకి కృష్ణవేణిగారు తమ 'మనదేశం' చిత్రంలో తొలి అవకాశం ఇవ్వడం మరచి పోలేని విషయం. ఘంటసాల శతాబ్ది పురస్కారం ఆయనను తొలిసారి సంగీత దర్శకుని చేసిన కృష్ణవేణి కి ఆకృతి సంస్థ ఇవ్వడం అత్యంత ఔచిత్యంగా ఉంది. ఎవరినైనా సక్సెస్ తర్వాతనే గుర్తు పెట్టు కుంటారు. కానీ ఎంతోమందికి సక్సెస్ ఇచ్చిన కృష్ణవేణికి తగినంత గుర్తింపు రాకపోవడం బాధాకరం. ఈ వేదిక ద్వారా ఈ మహానీయురాలితో పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను' అని అన్నారు. 'ఘంటసాల శత జయంతి పురస్కారాన్ని కృష్ణవేణికి ఇవ్వడం ఆమెకు ఆకృతి ఇచ్చిన అరుదైన గౌరవం. ఇప్పటి తరం సినిమా వాళ్ళకు ఆమె జీవితం ఒక పుస్తకంలా ఉపయోగ పడుతుంది' అని విశిష్ట అతిథిగా విచ్చేసిన తెలంగాణా పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్ చెప్పారు. కృష్ణవేణి ఒక లెజెండ్ అంటూ సినీ నటి రోజా రమణి ప్రశంసించారు. ఘంటసాల కోడలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు మనుమరాలు అజిత మాట్లాడుతూ, 'కృష్ణ వేణిని చూడాలన్న నా కల ఇప్పటికి నెరవేరింది' అని అన్నారు. ఆకృతి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫిక్కీ సిఎండి అచ్యుత జగదీష్ చంద్ర, నటుడు మోహన కృష్ణ తదితరులు పాల్గొన్నారు.